15/11/2022
మిత్రులారా.... చాలా విషాదకర వార్త. తెనాలి మండల గ్రామమైన బుర్రిపాలెం గ్రామానికి చెందిన మా బుర్రిపాలెం బుల్లోడు, సూపర్ స్టార్, ఆంధ్ర జేమ్స్ బాండ్ శ్రీ ఘట్టమనేని కృష్ణ గారు ఈరోజు (15-11-2022 ) తెల్లవారు ఝామున 04 గంటలకు అనారోగ్యంతో హైదరాబాద్ లో కన్ను మూసారు. తెనాలి సమీపాన కల బుర్రిపాలెం గ్రామానికి చెందిన వారు కావడంతో తెనాలితో ఎనలేని అనుబంధం ఉంది. వారిని ప్రజాశక్తి పత్రికలో తెనాలి లో వర్క్ చేసినప్పుడు ఒకసారి ఇంటర్వ్యూ చేసే భాగ్యం నాకు కలిగింది. తెనాలి తాలూకా హై స్కూల్ లో పాఠశాల విద్యను పూర్తి చేసుకున్నారు. ఎనిమిదవ తరగతి నుండి తెనాలిలో విద్యా భాసం చేసేటప్పుడు తన తోటి మిత్రులు మునిసిపల్ పాఠశాలలో సైన్సు ఉపాధ్యాయుడిగా పనిచేసిన శ్రీ ఘట్టమనేని వెంకటప్పయ్య, తెనాలి సినిమా థియేటర్స్ లో సీనియర్ ఆపరేటర్ గా పనిచేసిన మోటుపల్లి కృష్ణబాబు ముగ్గురూ కలసి సైకిళ్లపై తెనాలి వచ్చి చదువుకునే వారు. తెనాలి కొత్తపేటలోని ములుకుట్లవారి వీధిలో ములుకుట్ల లక్ష్మీ నారాయణ అనే ఉపాధ్యాయుని వద్ద ఈ ముగ్గురు మిత్రులు ఆంగ్లం, గణితం పాఠాల నిమిత్తం ట్యూషన్ కు వచ్చేవారు.
సూపర్ స్టార్ కృష్ణ తన జన్మస్థలమైన బుర్రిపాలెం గ్రామంలో అనేక చిత్రాలు నిర్మించారు. మీనా, పాడిపంటలు, ప్రజారాజ్యం, బుర్రిపాలెం బుల్లోడు, రైతు భారతం,ఇత్యాది అనేక చిత్రాలను నిర్మించి ఈ ప్రాంతంలో సందడి చేసారు. ప్రజారాజ్యం, ఈనాడు చిత్రాలలో కొన్ని సన్నీవేశాలు తెనాలి చిత్రీ కరించారు. తెనాలి ఆషా సినిమా థియేటర్ ప్రారంభోత్సవం చేశారు. ఇలా వారితో మా తెనాలి ప్రజలకు ఎనలేని అనుబంధం ఉంది.
1965 లో తేనే మనసులు చిత్రం తో హీరోగా సినీ రంగప్రవేశం చేశారు. సాహసానికి ప్రతిరూపమైన సూపర్ స్టార్ కృష్ణ సినీ జీవితం 1978 నుండి 1985 మధ్య కాలం పీక్ స్టేట్ అని చెప్పవచ్చు. ఒక దశలో తెనాలిలోని అన్ని సినిమా హాళ్లలో కృష్ణ గారు నటించిన సినిమాలు మాత్ర్రమే ప్రదర్శనకు నోచుకోవడం విశేషం. వారు తెలుగు లో నిర్మించిన తొలి సినిమా స్కోప్ చిత్రం అల్లూరి సీతారామరాజూగా ప్రేక్షకుల హృదయాలలో చెరగని ముద్ర వేశారు. సింహాసనం పేరుతో అయన దరర్శకత్వం వహించి, నటించిన తెలుగులో తోలి 70 ఎంఎం చిత్రం అప్పట్లో ఒక సంచలనం సృష్టించింది. అయిదు దశాబ్దాల సినీ జీవితంలో మొతం 350 చిత్రాలలో కృష్ణ నటించారు. 1965 లోఆయన నటించిన తేనెమనసులు తొలి చిత్రం కాగా 2016 లో విడుదలైన `శ్ర్రీశ్రీ` కృష్ణగారు నటించిన చివరి సినిమా. లెక్క లేనన్ని అవార్డుతో రివార్డులు అందుకున్న నటశేఖర కృష్ణ భారత ప్రభుత్వం నుండి 2009 లో పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. వారి మృతికి సంతాపం తెలియజేస్తూ, కుటుంబసభ్యులకు సానుభూతి తెలియజేస్తూ అశ్రు నివాళి.....
*గ్రేటర్ గుంటూరు న్యూస్*
*ఎడిటర్ చెరుకూరి శ్రీనివాస్*