21/04/2021
పురాణాల ప్రకారం, శ్రీరాముని పుట్టినరోజు, పెళ్లిరోజు, పట్టాభిషేకం నవమి రోజునే జరిగింది. అందుకే ఈరోజు హిందువులంతా పెద్ద పండుగలా జరుపుకుంటారు. ఏక పత్నీ వ్రతుడు, తండ్రి మాట జవదాటని రాముడు, నాన్నకు ఇచ్చిన మాట కోసం 14 సంవత్సరాల పాటు వనవాసానికి వెళ్లాడు.
ఆ వనవాసంలో రెండున్నర సంవత్సరాలు భద్రాచలంలోనే గడిపారట. అందుకే ఆ భద్రాద్రి పుణ్యక్షేత్రాన్ని దక్షిణ అయోధ్యగా పిలుస్తారు. ఈ సందర్భంగా శ్రీరాముని గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.
పురాణాల ప్రకారం, త్రేతాయుగంలో పెద్ద అటవీ ప్రాంతం ఉండేది. ఆ అటవీ ప్రాంతాన్ని పర్ణశాలగా పిలిచేవారప్పుడు. ఇక్కడే ఓ కుటీరాన్ని ఏర్పాటు చేసుకుని భార్య సీతాదేవి, తమ్ముడితో నివాసం ఉండేవాడు. రామాయణంలో ప్రధాన ఘట్టం జరగడానికి నాంది పలికింది ఈ ప్రదేశంలోనే. ఈ కుటీరంలోనే.. ఇక్కడి ప్రాంతంలో ఉండే కుటీరంలోనే లక్ష్మణుడు సూర్పనఖ ముక్కుచెవులు కోసేశాడు. ఇదే అడవిలో సీతమ్మ బంగారు లేడీని చూసింది. రావణాసరుడు సీతాదేవిని ఎత్తుకెళ్లాడు. దీంతో రాముడు, రావణాసురునికి మధ్య యుద్ధానికి బీజం పడింది. రాక్షసుల సంహారం.. పర్ణశాలకు దగ్గర్లో ఉండే దుమ్ముగూడెం ప్రాంతంలోనే శ్రీరాముడు 40 వేల మంది రాక్షసులను సంహరించాడని చెబుతుంటారు. ఆ సమయంలో వచ్చిన దుమ్మువల్లే ఈ ప్రాంతానికి దుమ్ముగూడెం అనే పేరు వచ్చిందని చెబుతుంటారు. జటాయువు పాక.. మరోవైపు రావణాసరుడు సీతమ్మను ఎత్తుకు వెళ్తున్నప్పుడు జటాయువు అడ్డు తగిలింది భద్రాద్రికి సమీపంలోనే. జటాయువు రెక్క తెగిపడిన ప్రాంతమే జటాయువు పాకగా తర్వాత ఎటపాకగా మారినట్టు చరిత్రకారులు చెబుతుంటారు. ఇంకోవైపు అదే ప్రాంతంలో రాముడు సీతమ్మ వారి దాహం తీర్చడం కోసం బాణం ఎక్కుపెట్టి భూమిలోకి వదలగా.. భూమిలో నుండి నీళ్లు బయటకు వస్తాయి. : శ్రీరాముని పట్టాభిషేకం ఎలా జరిగిందో తెలుసా... సకల పాపాలు పోతాయని.. భద్రాచలంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలన్నీ రాముని సందర్శనతో పునీతమైనవే. అందుకే దక్షిణ అయోధ్యగా పిలిచే ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుంటే సర్వపాపాలు పోతాయని చాలా మంది నమ్ముతారు. మరో కథనం ప్రకారం.. పురాణాల ప్రకారం.. వనవాస సమయంలో శ్రీసీతారాములు, లక్ష్మణుడు కడప జిల్లా ఒంటిమిట్ట ప్రాంతంలో సంచరించారు. ఈ ప్రాంతంలో సీతమ్మ తల్లికి దాహం వేయగా.. అప్పుడు శ్రీరామ చంద్రుడు తన బాణంతో పాతాళ గంగను రప్పించాడు. ఒక మిట్టమీద రామాలయం నిర్మించబడటం వల్ల ఈ దేవాలయానికి ఒంటిమిట్ట రామాలయం అనే పేరు వచ్చింది. ఈ ఆలయంలో విగ్రహాలు ఒకే శిలలో మలచబడ్డాయి. అందుకే దీనికి ఏక శిలా నగరమనే పేరు వచ్చింది. సీతారామ కళ్యాణం తర్వాత.. శ్రీ సీతారాములు చిన్న వయసులోనే కాక, వారి కళ్యాణం తర్వాత కూడా మ్రుకండ మహర్షి, శ్రుంగి మహర్షి, కోరికమీద యాగ రక్షణకి, దుష్ట శిక్షణకి శ్రీరామ లక్ష్మణలు అంబులపొది, పిడిబాకు, కోదండం పట్టుకుని ఈ ప్రాంతానికి వవచ్చి, యాగ రక్షణ చేశారని కూడా చెబుతుంటారు. అందుకు ప్రతిగా ఆ మహర్షులు సీతారామ లక్ష్మణుల విగ్రహాలను ఏక శిలలో చెక్కించారనీ, తర్వాత జాంబవంతుడు ఈ విగ్రహాలకు ప్రాణ ప్రతిష్ట చేశాడని చాలా మంది నమ్ముతారు. పిలిస్తే పలుకుతాడంటా.. ఇక్కడి భక్తులను ఆకర్షించే అంశాల్లో ఇదొకటి. ఈ ప్రాంతంలో ఇమాంబేగ్ బావి. 1640 సంవత్సరంలో కడపను పాలించిన అబ్దుల్ నబీఖాన్ ప్రతినిధి ఇమాంబేగ్. ఒకసారి ఆయన ఈ ఆలయానికి వచ్చిన భక్తులను మీ దేవుడు పిలిస్తే పలుకుతాడా అని ప్రశ్నించాడట. చిత్తశుద్ధితో పిలిస్తే కచ్చితంగా పలుకుతాడని వారు సమాధానం ఇవ్వడంతో.. రాముడిని మూడుసార్లు పిలిచారట. అప్పుడు వారికి ప్రతి సమాధానంగా మూడు సార్లు ఓ అని సమాధానం వచ్చింది. అప్పటి నుండి ఆయన స్వామి వారి భక్తుడిగా మారిపోయాడు. అంతేకాదు అక్కడ నీటి అవసరాల కోసం ఒక బావిని తవ్వించాడు